గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్ నీది మయ్యం నేత కమల్ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్పార్క్ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్ జనవహర్రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్ఓ గోపీనాథ్ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్ ఎంపిక చేసింది * సరూర్నగర్ చెరువు మినీ ట్యాంక్బండ్లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్పార్క్ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురువారం అత్యధికంగా భద్రాచలంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది * రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్ కాంగ్రెస్మ్యాన్ డానికే డేవిస్ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి భూంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్ ఏ-షిఫ్ట్లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.