మాల్దీవులు, నేపాల్ సహా ఆరు దేశాలకు భారతీయ వ్యాక్సిన్లు
అంతర్జాతీయ సమాజం అవసరాలకు అనుగుణంగా భారత వ్యాక్సిన్లను ఇతరదేశాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం గత శనివారం నుంచి మొదలెట్టిన భారత్ ఈ బుధవారం నుంచి భూటాన్, మాల్దీపులు, బంగ్లాదేశ్, నేపాల్, మయాన్మార్, సీషెల్స్ అనే ఆరుదేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
ఔషధ క్రమబద్ధీకరణ సంస్థ ఆమోదం లభించగానే భారత్ మరికొన్ని దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడానికి సిద్ధమవుతోందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా ఉన్న భారత్ తమకు కూడా కరోనా వ్యాక్సిన్ను పంపించాలని పలు దేశాలు ఇప్పటికే కేంద్రప్రభుత్వాన్ని సంప్రదించాయని మోదీ చెప్పారు.
విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయమై స్పష్టతనిచ్చింది. రాబోయే వారాలు నెలల కాలంలో భాగస్వామ్య దేశాలకు దశలవారీగా కోవిడ్ వ్యాక్సిన్ను భారత్ సరఫరా చేయనుందని విదేశాంగ శాఖ చెప్పింది. భారత్ ఇరుగు పొరుగు దేశాలు మాత్రమే కాకుండా అతి కీలకమైన భాగస్వామ్య దేశాలు కూడా తమకూ వ్యాక్సిన్లు కావాలని ఇప్పటికే భారత్ని సంప్రదించాయని సమాచారం.
కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న మానవాళి మొత్తానికి సాయపడగల వాక్సిన్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యం వనరుగా కలిగిన భారత్ తన మిత్ర దేశాల అభ్యర్థనలను వమ్ము చేయలేదని తొలి దఫాగా జనవరి 20న అంటే ఈ బుధవారం భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్ దేశాలకు వ్యాక్సిన్ టీకాలు పంపుతున్నామని విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇక శ్రీలంక, ఆప్ఘనిస్తాన్, మారిషస్ దేశాలు రెగ్యులేటరీ అనుమతులు తీసుకున్నట్లు నిర్ధారిస్తే వాటికి కూడా కోవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేయగలమని భారత్ చెప్పింది.
కాగా దేశంలో తొలివిడతగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను గత శనివారం ప్రారంభించిన భారత్ గత నాలుగురోజులుగా మూడున్నర లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్ అందించడం తెలిసిందే. తొలి దశలో 3 కోట్లమంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు అందించిన తర్వాత ఆరునెలల్లోగా 30 కోట్లమందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పెట్టుకుంది.
జాక్ మా కనిపించాడుగా..!
చైనా వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కనిపించకపోవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది. జాక్ మా ఇప్పుడు కనిపించడం లేదు.. ఎక్కడికి వెళ్ళాడో.. ఏమైపోయాడో ఎవరికీ ఎటువంటి ఆచూకీ లేకుండా పోయింది అంటూ కొద్దిరోజుల కిందట ప్రముఖ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున రిపోర్టింగ్ చేశాయి. జాక్ మా కొద్ది నెలల కిందట చైనా ప్రభుత్వానికి, ఆ దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే జాక్ మా పతనానికి కారణం అయ్యాయని చెబుతూ వచ్చారు. 2020 అక్టోబరులో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా మాట్లాడుతూ, చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల తరహాలో వ్యవహరిస్తున్నాయని విస్తృత స్థాయిలో ఆలోచించడం అలవర్చుకోవాలని సూచించారు.
చైనా ఆర్థిక వ్యవస్థను కించ పరుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు జాక్ మా. ఇక అంతే ఆ తర్వాత జాక్ మా డౌన్ ఫాల్ మొదలైంది. చైనా ప్రభుత్వం జాక్ మా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి.. అతడిని తొక్కేయడానికే ప్రయత్నించింది. సంస్థలు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా వేసింది. జాక్ మా ఎదిగేందుకు చర్యలను అడ్డుకోవడమే కాకుండా.. జాక్ మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ ఐపీఓను అడ్డుకోవడం మొదలుపెట్టింది. ఇదే జాక్ మాకు పెద్ద మైనస్ గా మారిపోయింది. ఆస్తులు హరించుకుపోవడం మాత్రమే కాకుండా.. రెండు నెలల్లోనే 11 బిలియన్ డాలర్లు నష్టపోయారు.
ఇలాంటి సమయంలో జాక్ మా కనిపించాడు. కొన్ని నెలల నుంచి కనిపించకుండా పోయిన జాక్ మా తాజాగా ఓ వీడియోలో కనిపించారు. గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు సాధించిన విజయాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంలో ఆయన ఇంగ్లిష్ టీచర్గాను పనిచేశారు. బుధవారం గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన కనిపించారు. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. తొలుత ఇంగ్లీష్ టీచర్గా పని చేసిన జాక్ మా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగింది. త్వరలోనే వచ్చి కలుస్తాను అని వారికి తెలిపారు. ఇక జాక్ మా మిస్సింగ్ రూమర్స్ కు చెక్ పడినట్లేనని చెబుతూ ఉన్నారు ప్రజలు.
న్యాయవాది నుంచి ఉపాధ్యక్షురాలి దాకా 'కమల హ్యారిస్' ప్రయాణం
అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా, మొట్టమొదటి నల్లజాతి, దక్షిణాసియా మూలాలున్న ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరొక విశేషం ఏమిటంటే.. అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలో తొలి హిస్పానిక్ మరియు మూడవ మహిళా న్యాయమూర్తి సోటోమేయర్ కమలచేత ప్రమాణ స్వీకారం చేయించడమే. అమెరికా పూర్వ అధ్యక్షుడు బరాక్ ఒబామాచే హైకోర్టుకు నామినేట్ చేయబడిన సోటోమేయర్ 2009 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ రెండు బైబిల్ పుస్తకాలు పట్టుకుని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రెండు బైబిల్స్లో ఒకటి కమల కుటుంబ సభ్యురాలు రేజీనా షెల్టన్కి చెందగా, మరొకటి అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ థుర్గూడ్ మార్షల్కి చెందినది.
బాల్యం నుంచి తనను ఆదరించిన రెజీనా షెల్టన్ ప్రోత్సాహం లేకుంటే నేను సెనేటర్గా కూడా ఉండేదాన్ని కాను అని కమల వినమ్రతతో చెబుతుంటారు. ఇక మార్షల్ అయితే న్యాయవాదిగా తాను వృత్తిని ఎంచుకోవడానికి స్పూర్తి కలిగించిన వ్యక్తిగా హ్యారిస్ చెబుతుంటారు.
అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా దేవి హ్యారిస్ తొలి ఇండో – ఆఫ్రో అమెరికన్ మహిళ. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆక్లాండ్లో 1964, అక్టోబర్ 20న ఆమె జన్మించారు. భారతీయ అమెరికన్ శ్యామల గోపాలన్, జమైకన్ మూలాలున్న డొనాల్డ్ హ్యారిస్ ఆమె తల్లిదండ్రులు. 2004లో డిస్ట్రిక్ట్ అటార్నీగా, 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఎన్నికయ్యారు. ఈ పదవి సాధించిన తొలి మహిళగా, తొలి ఇండో–ఆఫ్రో అమెరికన్గా చరిత్ర సృష్టించారు.
కమల 1986లో హోవర్డ్ వర్సిటీలో రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలతో బీఏ పూర్తి చేశారు. అనంతరం హాస్టింగ్స్ కాలేజ్ నుంచి 1989లో లా డిగ్రీ పొందారు. 1990 నుంచి 1998 వరకు ఆక్లాండ్లో డెప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు. గ్యాంగ్ దాడులు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వినియోగం.. తదితర కేసులను సమర్ధవంతంగా వాదించి, మంచి పేరు తెచ్చుకున్నారు.
అలాగే, స్వలింగ వివాహాలను నిషేధిస్తూ కాలిఫోర్నియా రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ వాదించాలన్న అభ్యర్థనను ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి, రాష్ట్రంలో ఆ చట్టం అమలు కాకుండా చూశారు.
తనఖా పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసేవారి అక్రమ విధానాలకు వ్యతిరేకంగా 2012లో ఆమె వాదించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2014లో న్యాయవాదిగా పనిచేస్తున్న డగ్లస్ ఎమ్హాఫ్తో ఆమెకు వివాహమయింది. అనంతరం, సెనేట్లో సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటలిజెన్స్, జ్యూడీషియరీ కమిటీల్లో సభ్యురాలిగా సేవలందించారు.
2019లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మొదట్లో ఆమె అభ్యర్థిత్వం పార్టీ శ్రేణుల్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ క్రమంగా గట్టి పోటీదారుగా ఎదిగారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించిన చర్చల్లో భాగంగా పోటీదారు జో బైడెన్తో జాత్యహంకార అంశంపై ఆమె చేసిన వాదన పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించి పెట్టింది. కానీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి శక్తి సరిపోదని భావించిన కమల బైడెన్కు మద్దతిచ్చి ఉపాధ్యక్షురాలి స్థానంతో సంతృప్తి చెందారు.
2016లో డెమొక్రాటిక్ పార్టీ నుంచి సెనేట్కు ఎన్నికైన తొలి ఇండో అమెరికన్గా, రెండో ఆఫ్రో అమెరికన్గా కమల రికార్డు సృష్టించారు. ఆనాటినుంచి నేటిదాకా అమెరికన్ మహిళ ఎంత అత్యున్నత స్థానానికి ఎదగగలదో నిరూపిస్తూ వచ్చిన కమల నేటినుంచి అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా
భారతదేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. దేశంలో గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అదే సమయంలో 16,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,95,660కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 162 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,718కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,45,741 మంది కోలుకున్నారు. 1,97,201 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 351 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,395 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,86,893 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,583 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,919 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,270 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 55 కరోనా కేసులు నమోదయ్యాయి.
19-01-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 39,099 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 35, గుంటూరు జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదైంది. నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి. గత 24 గంటల్లో 231 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,86,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,77,443 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,142కి చేరింది. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,660కి చేరుకుంది.
వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
రిపబ్లిక్ డే 'ట్రాక్టర్ ర్యాలీ'కి సన్నాహాలు..
సాగుచట్టాల రద్దు డిమాండుతో జనవరి 26న ఢిల్లీలో తలపెట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ కోసం పంజాబ్లోని గ్రామగ్రామాన ట్రాక్టర్ ర్యాలీలను రైతు సంఘాలు ప్రారంభించాయి. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ కోసం నవన్షార్, గురుదాస్పూర్ వంటి ప్రాంతాల్లో ట్రాక్టర్ ర్యాలీలను నిర్వహించామని రైతు నేతలు చెప్పారు.
రిపబ్లిక్ డే నాటి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనడానికి పంజాబ్ ప్రజల్లో గొప్ప ఉత్సాహం నెలకొందని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుఖ్ దేవ్ సింగ్ కోక్రికాలన్ చెప్పారు. అనేక గ్రామాలనుంచి అయిదు నుంచి పది ట్రాక్టర్ల వరకు ఢిల్లీ తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి.
కొన్ని గ్రామాల్లో 50 ట్రాక్టర్లు కూడా డిల్లీ ర్యాలీకి రావడానకి ఆసక్తి చూపుతున్నాయి. ట్రాక్టర్ పేరేడ్ కోసం మేం పూర్తిగా సన్నద్ధమవుతున్నాం. జనవరి 20, 21 తేదీల్లో పంజాబ్ లోని అన్ని గ్రామాల్లో ట్రాక్టర్ల కవాతు నిర్వహించాలని మేం పిలుపునిచ్చాం అని సుఖదే్వ్ సింగ్ చెప్పారు.
కేంద్రప్రభుత్వం సాగు చట్టాల పేరిట తీసుకొచ్చిన మూడు నల్లచట్టాలను రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి తేవడానికి రిపబ్లిక్ డే నాడు గరిష్ట సంఖ్యలో రైతులను తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని గురుదాస్ పూర్ ర్యాలీలో పాల్గొన్న సాధారణ రైతు చెప్పారు.
ఇప్పటికే ఢిల్లీ శివార్లలో చేరి ఉన్న ట్రాక్టర్లకు తోడుగా పంజాబ్ గ్రామాల్లో అనేక ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నదే తమ ఉద్దేశమని మరొక రైతు చెప్పారు.
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతు సంఘాలు తలపెట్టిన రైతు ర్యాలీలో అపశ్రుతి ఏర్పడితే అది జాతీయ గౌరవానికే భంగం కలిగిస్తుంది కాబట్టి ఆ రోజు రైతు ర్యాలీని నిలిపివేస్తూ ఆదేశింఛాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.
అయితే కోర్టు జోక్యం కంటే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులే తగిన సామర్థ్యంతో పనిచేయగలరని అపెక్స్ కోర్టు వ్యాఖ్యానించడం తెలిసిందే.
మరోవైపు రైతు సంఘాలు తాము జరపబోయే ట్రాక్టర్ ర్యాలీ రిపబ్లిక్ డే కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు కల్పించదని హామీ ఇచ్చాయి.
రిపబ్లిక్ డేను అడ్డుకోం.. శాంతి యాత్ర జరుపుతాం.. రైతు నేతలు
నేడే జో బైడన్, కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం..
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్, ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్లు నేడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో నాలుగేళ్లుగా సాగిన డొనాల్డ్ ట్రంప్ అప్రతిష్టాకరమైన పాలన ముగిసిపోనుంది. నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించిన బైడన్ 232 ఓట్లకు పరిమితమైన ట్రంప్ను తోసిరాజన్నారు. పరాజయాన్ని చివరివరకూ అంగీకరించని ట్రంప్ జనవరి 6న కేపిటల్ బిల్ పాలనా భవనంపై మద్దతుదారులు చేసిన దాడితో పరువుపోగొట్టుకుని ఆనాటినుంచే కనుమరుగైపోవడం తెలిసిందే.
అగ్రరాజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అధికార మార్పిడి తుపాకీ నీడలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు కరోనా ఆంక్షలు, మరోవైపు ట్రంప్ మద్దతుదారుల నుంచి పొంచి ఉన్న ప్రమాదంతో జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు.
ట్రంప్ పరాజయాన్ని ఇప్పటికీ అంగీకరించని మద్దతుదారుల కారణంగా అల్లర్లు చెలరేగుతాయని ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో 25 వేల మంది జాతీయ భద్రతా బలగాలు వాషింగ్టన్ అణువణువును జల్లెడ పడుతున్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా వేలాదిగా స్థానిక పోలీసులు రేయింబగళ్లు పహారా కాస్తున్నారు.
అమెరికన్లకు ట్రంప్ పాలనలో తగిలిన గాయాలను మాన్పడమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్న బైడెన్ అమెరికా క్యాపిటల్ భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార చేయనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకి) ఈ కార్యక్రమం ప్రారభం కానుంది.
గతంలో మాదిరిగా అధికార మార్పిడి శాంతియుతంగా జరగకపోవడంతో భయం గుప్పిట్లో దేశ రాజధాని వాషింగ్టన్ ఉంది. ఎటు వైపు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో తెలీక అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు అవుతున్నారు.
బుధవారం ఉదయమే ఆయన వాషింగ్టన్ వీడి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే జరిగితే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరుకాని నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలుస్తారు.
లేడీ గాగా జాతీయ గీతాలాపానతో మొదలయ్యే ప్రమాణ స్వీకార కార్యక్రమం లాంఛనప్రాయంగా జరిగాక, దేశప్రజలను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించడంతో ముగిసిపోతుంది. సైనిక అధికారులు, మద్దతుదారులు వెంటరాగా క్యాపిటల్ భవనం నుంచి వైట్ హౌస్కి అధ్యక్ష, ఉపాధ్యక్షులు చేరుకుంటారు.
చివరిగా టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో ‘‘సెలబ్రేటింగ్ అమెరికా’’అని 90 నిముషాల సేపు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలంతా ఆనందోత్సాహాల్లో ఉన్నారని చెప్పడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
దేశాధ్యక్ష పదవికి బైడెన్ 32 ఏళ్ల పోరాటం
అధ్యక్ష స్థానాన్ని చేపట్టాలని 1988 నుంచి అంటే 32 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ విఫలమవుతూ వచ్చిన జో బైడెన్ ఎట్టకేలకు 2020 చివరినాటికి తన కలను సాకారం చేసుకున్నారు. 2008లోనూ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన బరాక్ ఒబామా.. తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ను ఎంపిక చేసుకున్నారు. ఆ ఇద్దరు తమ రిపబ్లికన్ ప్రత్యర్థులు జాన్ మెక్ కెయిన్, సారా పాలిన్లపై సునాయాస విజయం సాధించారు.
తరువాత, 2012లోనూ ఈ జోడీ అమెరికా, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2015లో తన పెద్ద కుమారుడు బ్యూ బ్రెయిన్ కేన్సర్తో మరణించడం బైడెన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. దాంతో, 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలవాలనుకోవడం లేదని స్పష్టం చేసి, డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు కోసం కృషి చేశారు.
చివరిసారిగా అధ్యక్ష బరిలో ఉన్నట్లు 2019 ఏప్రిల్లో బైడెన్ ప్రకటించారు. పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం సాధించారు. ఆ తరువాత, హోరాహోరీ పోరులో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై నిశ్చయాత్మక విజయం సాధించి, దేశ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక జో బైడెన్ కమలా హ్యారిస్తోపాటు చేసే ప్రారంభ ప్రసంగాన్ని దేశంలోని అన్ని ప్రముఖ టీవీ చానల్స్ ప్రసారం చేయడం విశేషం. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లలోనూ ఈ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఒక విషాదం మరవకముందే మరొకటి.. పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..!
గుజరాత్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి. సూరత్లోని కొసాంబ సమీపంలో పుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందాగా, ఇంకొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయ్గురి జిల్లాలోని ధూప్గురిలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రాళ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటో, కారును ఢీకొట్టింది. ప్రమాదంలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పొగమంచు కారణంగా సరిగా కనిపించకుండా ఉండడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. జల్పాయ్ గురి అసిస్టెంట్ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్ సుమత్ రాయ్ మాట్లాడుతూ "రాళ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటో, కారును ఢీకొట్టింది. ప్రమాదంలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయడంలో విఫలమవడంతో ట్రక్కును కుడివైపుకు తిప్పాడు. ఇంతలో ఎదురుగా వస్తున్న వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది.. ట్రక్కులో ఉన్న రాళ్లు కాస్తా ఆ వాహనాలపై పడడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఘటనలో మొత్తం నాలుగు వాహనాలకు ప్రమాదం చోటు చేసుకుంది" అని తెలిపాడు.
ధూప్గురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారని.. విషయం తెలిసిన 10 నిమిషాల్లోనే క్రేన్ లను తీసుకుని వచ్చి రాళ్లను పక్కకు తీసి వేయించామని సుమత్ రాయ్ తెలిపారు. సహాయ చర్యల్లో స్థానికులు కూడా పాల్గొన్నారని చెప్పారు. స్థానిక ఆసుపత్రికి గాయపడ్డ వారిని తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని.. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
కరోనాకు వ్యాక్సిన్ ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ఇస్తూ ఉన్నారు. టీకా మీద కొందరు వెనకడుగు వేస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు కొందరు వైద్యసిబ్బంది వెనకడుగు వేస్తుండటంపై కేంద్రం స్పందించింది. టీకా గురించి భయపడాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని కోరింది. కరోనా వంటి మహమ్మారికి వ్యాక్సిన్తోనే అడ్డుకట్ట వేయగలమని, వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతోంది కేంద్రం. టీకా తీసుకున్న అనంతరం చాలా కొద్దిమందిలోనే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని, అయితే ఇది సాధారణ విషయమని.. ఒకవేళ తీవ్ర స్థాయిలో ప్రతికూలతలు ఎదురైతే వెంటనే చికిత్స అందించడానికి ప్రతీ సెంటర్లలోనూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ వ్యాక్సిన్ తీసుకునే విషయంలోనే రోల్ మోడల్గా నిలవాలని.. అర్హులైన ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 3.8 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వారిలో 580 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించగా, ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు మరణించారని అంటున్నా.. ఇది వ్యాక్సిన్కి సంబంధించినది కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే, తాము తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్, టీకా ఎవరు తీసుకోకూడదన్న విషయంపై ప్రకటన విడుదల చేసింది. గతంలో అలర్జీలు ఉన్నవారు, రక్త హీనత, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కొవాగ్జిన్ ను తీసుకోవద్దని సలహా ఇచ్చింది. కొవాగ్జిన్ కాకుండా మరో వేరియంట్ ను తీసుకున్న వారు, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపించే మందులను వాడుతున్న వారు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా టీకాకు దూరంగా ఉండాలని సూచించింది.
దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేయగా.. దేశంలో గత 24 గంటల్లో 10,064 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 17,411 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,05,81,837కు చేరింది. గత 24 గంటల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,556కు పెరిగింది.
సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!
దుస్సాహసానికి అసలు సిసలు నిర్వచనం తానేనని మరోసారి చైనా నిరూపించుకుంది. భారత్ అభ్యంతరాలను పెడచెవిన పెట్టడంలో రాటుదేలిపోయిన చైనా తాజాగా మరో దుస్సాహసానికి పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత భూభాగంలోకి 4.5కిలోమీటర్ల మేర చొచ్చుకురావడమే కాక అక్కడ ఏకంగా ఓ గ్రామాన్నే చైనా నిర్మించింది. దాదాపు 101 ఇళ్లు ఉన్న ఈ గ్రామం శాటిలైట్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతున్నాయి.
గతేడాది నవంబర్లోనే చైనా డోక్లాం ఘర్షణ స్థావరానికి అతి సమీపంలో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. తాజాగా వాస్తవ సరిహద్దుకు కేవలం 4.5కిలోమీటర్ల దూరంలోనే మరో గ్రామాన్ని ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఈ ప్రాంతం మొత్తంగా భారత్ భూభాగంలోనిదే అయినా, 1959 నుంచి దీనిపై చైనా ఆజమాయిషీ కొనసాగుతోందని భారతీయ అధికారిక మ్యాప్లు సూచిస్తున్నాయి. ఇంతకు ముందు చైనా గస్తీ కేంద్రంగా ఉంటూవచ్చిన ప్రాంతంలో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా ఇప్పుడేం చేస్తావు అన్న చందంగా భారత్కు సవాల్ విసిరింది. ఎగువ సుబన్సిరి జిల్లా సారి చు నది గట్టుపై నెలకొన్న ఈ గ్రామం ఇప్పుడు వేలాదిమందికి ఆశ్రయం కల్పించనుంది. చాలాకాలంగా ఈ ప్రాంతం భారత్, చైనా మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉంటూ వస్తోంది.
చైనా నిర్మించిన గ్రామం భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సుబన్సిరి జిల్లా సారి చు నది ఒడ్డున ఏర్పడింది. ఇక్కడ ఎల్లప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఇక ప్రస్తుతం చైనా గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతానికి సంబంధించి 2019, ఆగస్టు నాటి శాటిలైట్ ఫోటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోగా.. 2020, నవంబర్ నాటి చిత్రాల్లో వరుసగా ఉన్న ఇళ్లు దర్శనమిచ్చాయి.
అంటే ఏడాది వ్యవధిలోనే చైనా ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఫోటోలని బట్టి తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించగా.. సరిగా స్పందించలేదని తెలిసింది. సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపట్టిన నిర్మాణ పనులను ఇండియా జాగ్రత్తగా గమనిస్తోంది. గతకొన్నేళ్లుగా చైనా సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడుతోంది అని తెలిపినట్లు సమాచారం.
ఇక అరుణాచల్ ప్రదేశ్లో చైనా చేపట్టిన నిర్మాణాల గురించి గతేడాది నవంబర్లోనే ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ తపిర్ గావో ప్రస్తావించారు. లోక్సభలో చైనా చొరబాట్ల గురించి, ప్రత్యేకంగా ఎగువ సుబున్సిరి జిల్లా గురించి హెచ్చరించారు.
ఇక తాజాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా ఎగువ సుబన్సిరి జిల్లాలో నది వెంబడి 60-70 కిలోమీటర్లు లోనికి ప్రవేశించింది. ఇక్కడ ఓ డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతోంది అన్నారు.
ఇక గతేడాది గల్వాన్ ఘర్షణ అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి.
హింస సమాధానం కానేకాదు.. మెలనియా ట్రంప్ వీడ్కోలు సందేశం
అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ శ్వేతసౌధానికి వీడ్కోలు పలుకుతూ చివరి సందేశం పంపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళగా మా సమయం ముగిసిపోయిందని ప్రకటించారు. ట్రంప్ మద్దతుదారులు యుఎస్ కేపిటల్ హిల్ భవనంలోకి దూసుకెళ్లిన రెండు వారాల తర్వాత.. హింస దేనికీ సమాధానం కాదంటూ మెలనియా ట్రంప్ తాజాగా హితవు పలకడం విశేషం.
లాంఛనప్రాయంగా ఆరు నిమిషాల పాటు మెలనియా చేసిన వీడియో ప్రసంగంలో తన భర్త ట్రంప్ గురించి సాధారణ ప్రస్తావన మాత్రమే చేసిన మెలనియా ట్రంప్ సైనిక కుటుంబాలకు, కరోనా కాలంలో సేవలందించిన ఆరోగ్య సిబ్బందికి, వేధింపుల పాలైన బాధితులకు సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు.
గత నాలుగేళ్ల కాలం నేను మర్చిపోలేను అని ప్రథమ మహిళ చెప్పారు. డొనాల్డ్, నేను వైట్ హౌస్లో మా సమయాన్ని ముగిస్తున్నందున ఈ నాలుగేళ్లకాలంలో మాతో పరిచయమైన వారి జ్ఞాపకాలు, వారి ప్రేమాస్పదమైన గాథలు, దేశభక్తి, కృత నిశ్చయాన్ని నేను గుర్తుపెట్టుకుంటానని మెలనియా చెప్పారు.
మీరు చేసిన ప్రతిపనినీ ప్రేమించండి. కానీ హింస ఎన్నటికీ సమాధానం కాదని గుర్తుంచుకోండి. ఏ రకంగానూ హింస సమర్థనీయం కాదు అని మెలనియీ చెప్పారు. నేను వైట్ హౌస్కి వచ్చినప్పుడు ఒక తల్లిగా నేను సిబ్బందిని ప్రోత్సహించడానికి, కరుణకు సంబంధించిన పాఠాలు బోధించడానికి నేను శక్తిని సమకూర్చుకున్న అనుభూతిని నేను ప్రతి క్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆమె అన్నారు.
ఈ దేశం మనకు చేసిన వాగ్దానం మనందరిదీ. మన సమగ్రత, విలువలను ఎవరమూ మర్చిపోరాదు. మనల్ని మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులను గురించి ఆలోచించే విషయంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మన దైనందిన జీవితాల్లో మంచి అలవాట్లను పెంపొందించుకుందాం అని 50 ఏళ్ల మెలనియా ట్రంప్ పేర్కొన్నారు.
ఒక రకంగా ట్రంప్ దంపతుల నిష్క్రమణ లాంఛన ప్రాయమే అయినప్పటికీ అసాధారణ పరిస్థితుల మధ్యే జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపు సాధించిన జో బైడెన్ ఉనికిని గుర్తించడానికి కూడా అంగీకరించని ట్రంప్ కనీసం తన వారసుడిని అభినందించడానికి కూడా సిద్ధపడకుండా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నారు. పైగా ట్రంప్ దంపతులు కొత్త అధ్యక్షుడు బైడెన్ ఆయన సతీమణికి ఓవల్ ఆఫీసులో సాంప్రదాయికంగా అందించే టీ విజట్కు కూడా ఆహ్వానించకపోవడం గమనార్హం.
జనవరి 6న తన మద్దతుదారులు కేపిటల్ హిల్ పై దాడిచేసిన వారం రోజులుకు రెండోసారి అభిశంసనగు గురైనా ట్రంప్ బహిరంగంగా కనిపించడమే మానేశారు. జనవరి 20 ఉదయం వైట్హౌజ్ను, వాషింగ్టన్ను ట్రంప్ దంపతులు వీడనుండగా అదే రోజు దేశ నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
అధ్యక్ష పదవికి పూర్వ వైభవం తీసుకొస్తా.. గాయాలు మాన్పుతా..
రైతులతో చర్చలు జనవరి 20కి వాయిదా.. పంతం వద్దన్న తోమర్
సాగు చట్టాల కొనసాగింపుపై రైతునేతలతో జరగనున్న తదుపరి దఫా చర్చలు వాయిదా పడ్డాయి. మంగళవారం మొదలుకావలసిన పదవ దఫా చర్చలను బుధవారానికి వాయిదా వేసినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. రైతునేతలతో పదోదఫా చర్చలు వాస్తవానికి నేడు అంటే మంగళవారమే జరగాల్సి ఉంది. కానీ ఈ చర్చలను ఒకరోజు ముందుకు వాయిదా వేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ విధానాలు కోట్లాది మంది రైతుల జీవితాలను దెబ్బతీయనున్నందున ఆ చట్టాలను వెంటనే రద్దు చేయవలసిందిగా కోరుతూ గత నవంబర్ నుంచి పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ శివార్లలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన 41 మది రైతు ప్రతినిధులు కేంద్రప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. కేంద్రం తరపున కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్ చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత సెప్టెంబరులో పార్లమెంటు ఆమోదించిన కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న డిమాండును తొలినుంచి ప్రభుత్వం తోసిపుచ్చుతుంటడం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో ఇంతవరకు ప్రభుత్వం, రైతు నేతల మధ్య తొమ్మిది విడతలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
రైతుల పంతం అర్థం లేనిది.. వ్యవసాయ మంత్రి తోమర్
కాగా, కొత్త సాగు చట్టాలపై రైతులు మొండిపట్టు వీడి, ప్రభుత్వంతో అంశాల వారీగా చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించినందున, రైతులు పంతానికి పోవడంలో అర్థం లేదన్నారు.
ఆదివారం మధ్యప్రదేశ్లోని మోరెనాలో కేంద్రమంత్రి తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఎటువంటి దాపరికాలు లేకుండా మనస్ఫూర్తిగా చర్చలకు ఆహ్వానిస్తోందని చెప్పారు. ప్రభుత్వం కొన్ని రాయితీలను ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది కానీ రైతులు మాత్రం చట్టాల రద్దుపైనే పట్టుదలకు పోతున్నారు అని చెప్పారు.
దేశం మొత్తానికి వర్తించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చింది. వీటికి రైతులు, నిపుణులు, సంబంధిత వర్గాల మద్దతు ఉందని కేంద్రమంత్రి తెలిపారు. మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరిస్తూ రైతు సంఘాలకు ప్రతిపాదనలు పంపాం. పంట వ్యర్థాల దహనం, విద్యుత్ వంటి వాటిపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాం. రైతు సంఘాలు మాత్రం సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నాయి. అంశాల వారీగా చర్చల్లో సంఘాల అభ్యంతరాలు సరైనవే అని తేలితే, ప్రభుత్వం పరిశీలించడానికి సిద్ధంగా ఉంది అని తోమర్ చెప్పారు.
కాగా, కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 19వ తేదీన మొట్టమొదటి సమావేశం జరపనుంది. పూసా క్యాంపస్లో ఈ సమావేశం ఉంటుందని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో నిర్ణయిస్తామన్నారు. కమిటీలోని నలుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సాగు చట్టాలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు జరపనున్న విచారణ సందర్భంగా కమిటీ సభ్యుడు వైదొలగిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.
రామమందిర నిర్మాణానికి డిగ్గీ రాజా సంచనల విరాళం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి ప్రధాని నరేంద్రమోదీ అభ్యర్థన మేరకు సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు సినీతారలు, వ్యాపార వేత్తలు ఇతర ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లక్షా 11 వేల 111 రూపాయలు విరాళం అందించడం సంచలనం కలిగిస్తోంది.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన దిగ్విజయ్ సింగ్ తాను మతకలహాలకు వ్యతిరేకమే కానీ రామాలయ నిర్మాణానికి కాదని సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే కేంద్రప్రభుత్వం ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 15 నుంచి విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా మొదలెట్టిన 44 రోజుల పాటు విరాళాల సేకరణ కార్యక్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం పట్ల దిగ్విజయ్ సింగ్ తన ఆందోళనను వ్యక్తం చేసారు.
ప్రధానికి రాసిన లేఖలో మహాత్ముని సూక్తిని దిగ్విజయ్ ఉల్లేఖించారు. మతం అనేది రాజకీయ సాధనం కాదని, అది మనిషికి, భగవంతునికి సంబంధించిన వ్యవహారమని డిగ్గీ రాజా చెప్పారు. ఆలయనిర్మాణానికి విరాళాలు ఇవ్వడం అనేది వ్యక్తుల ఇష్టాఇష్టాలతోనే జరగాలి కానీ హింసను ప్రేరేపిస్తూ విరాళాల సేకరణ జరపడం సరైంది కాదని విమర్శించారు.
ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ పేరిట కొన్ని సంస్థలు కర్రలు, కత్తులు, గొడ్డళ్లు వంటి ఆయుధాలను ప్రదర్శస్తూ భారీ స్థాయి విరాళాలకు తలపడుతున్నారు. ఇలా విరాళల సేకరణ సందర్భంగా ఒక మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఏ మత సంప్రదాయాల్లోనూ భాగం కాదని, కారాదని నేను భావిస్తున్నాను అంటూ దిగ్విజయ్ ప్రధానికి రాసిన లేఖలో చెప్పారు.
మద్యప్రదేశ్లో మూడు చోట్ల జరిగిన ఇలాంటి ఘటనలు దేశంలో సామాజిక చట్రానికి నష్టం కలిగించనున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులు విరాళాలు సేకరించడానికి రామాలయం ట్రస్టు అధికారం ఇచ్చిందా అని ఆశ్చర్యం వేస్తోంది. ఇలాంటి వ్యక్తులు ప్రజల నుంచి విరాళాలు సేకరించాక వారికి రసీదులు ఇస్తున్నారో లేదో కూడా తెలీటం లేదని దిగ్విజయ్ సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
మీరు దేశానికి ప్రధాని. రామాలయ నిర్మాణం పట్ల ఇతర మతస్తులకు ఎలాంటి వ్యతిరేకతా లేదని మీకు తెలుసు. కానీ రామాలయ నిర్మాణం పేరుతో విరాళాల సేకరణ పని సౌహార్ద వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది అంటూ ఆయన ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు, పైగా హింసాత్మక పద్ధతుల ద్వారా రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణ చేపట్టకుండా ఇలాంటి సంస్థలను నిషేధించాలని డిగ్గీ రాజా ప్రధానికి సూచించారు.
కాగా, బీజేపీ హిందువుల పార్టీ అని విమర్శించిన డిగ్గీ రాజా ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించడం విశేషం. గతంలో ఆయన ఆలయ నిర్మాణంపై విమర్శలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి నుంచి విరాళం రావడం ఆశ్చర్యమేస్తోంది.
అయోధ్యలో ఆలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ 44 రోజుల పాటు విరాళాల సేకరణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో సంబంధం ఉన్న దిగ్విజయ్ సింగ్ రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 11 వేల 111 విరాళం ఇవ్వడం గమనార్హం.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-2020

రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-2020

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?
10-08-2020

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-2020

హైదరాబాద్లో బాంబు పేలుడు.. కార్లు, బస్సుల అద్దాలు ధ్వంసం
21-08-2020

నారా లోకేశ్ కి విడదల రజనీ షాక్
28-10-2020

ఏంటి రజనీ మేడమ్.. అసలు కథ అదేనా
30-10-2020

అప్పుడలా.. ఇప్పుడిలా..! విడదల రజినీ ఇంతలా మారిపోయారా..?
04-07-2020

విజయసాయి రెడ్డికి ఇష్టం లేని పని జరగబోతోందా?
24-07-2020