రెండో రోజుకే జనం దారిలోకి వచ్చినట్లే.. రోడ్లపై గుంపులు మాయం
25-03-202025-03-2020 11:38:10 IST
2020-03-25T06:08:10.404Z25-03-2020 2020-03-25T06:08:04.054Z - - 18-04-2021

కరోనా వైరస్ వ్యాప్తి పట్ల స్వతహాగా కలిగిన భయం కావచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చేస్తున్న హెచ్చరికల ప్రభావం వల్ల కావచ్చు.. తెలంగాణ వ్యాప్తంగా పగటిపూట జనం రోడ్లమీదకు రావడం బాగా తగ్గిపోయింది. సోమవారం ప్రభుత్వ ఆంక్షల్ని లెక్క చేయకుండా ప్రధాన రహదారులమీదికొచ్చిన జనం మంగళవారానికల్లా బాగా తగ్గిపోయారు. దండం దశగుణ భవేత్ అన్నట్లుగా ప్రభుత్వం జనసంచారంపై కొరడా ఝళిపించినందుకే జనసంచారం తగ్గిందని మీడియా నివేదికలు. ఎలాగైతేనేం.. ఫలితం దక్కిందని ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. పైగా మార్చి 31 వరకు కాకుండా మరో మూడు వారాలపాటు దేశమంతా లాక్ డౌన్ అంటూ కేంద్రం ప్రకటించడం, ఇళ్లలోంచి బయటకు వస్తే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలకు కూడా ఇవ్వడానికి వెనుకాడమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరిక చేయడంతో మంగళవారం రాత్రి 7 గంటలకే హైదరాబాద్ తదితర పట్టణాలు నిర్మానుష్యమైపాయాయి. మీడియా రిపోర్డర్లు, సిబ్బంది తప్పితే రోడ్లమీద తిరిగే వారే కనపడకుండా పోయారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా సోమవారం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని, కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని అపహాస్యం చేసిన ప్రజలు.. రెండో రోజు కొంత దారికొచ్చారు. లాక్డౌన్ ఉన్నా, జనం రోడ్ల మీదకు రావటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసిన నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం డీజేపీ మహేందర్రెడ్డి స్థానిక అధికారులందరికీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ను మరింత కఠినతరం చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశంతో యావత్తు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై ప్రత్యక్ష చర్యలకు దిగటంతో జనం దూకుడు తగ్గించారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం పరిస్థితి 70 శాతం అదుపులోకి వచ్చింది. అయినా కొన్నిచోట్ల రోడ్లపై సంచారం కనిపించింది. నిత్యావసరాలకు వచ్చేవారే కాకుండా, కొందరు సరైన కారణం లేకుండా వాహనాలతో రోడ్డెక్కారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ముగ్గురు చొప్పున తిరగటం, కార్లలో నలుగురైదుగురు ప్రయాణించటంతో కొన్ని ప్రాంతాల్లో అనవసర రద్దీ ఏర్పడింది. దీన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగానే పరిగణించింది. మంగళవారం నాటి పరిస్థితిని పరిశీలించి అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న సీఎం కేసీఆర్, మంగళవారం సాయంత్రం అత్యున్నత సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పైగా నిత్యావసర సరుకులు, వైద్యసేవలకు సంబంధించిన వాహనాలకు తప్ప మరి ఎవరికీ చమురు అమ్మకాలు జరపొద్దని కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో బుధవారం ఒక్క ప్రైవేట్ వాహనంకూడా రోడ్లపై కనిపించే పరిస్థితి లేనట్లే. దీంతో బుధవారం నుంచి పరిస్థితి చాలావరకు అదుపులోకి వచ్చే అవకాశముంది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో మంగళవారం చాలా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగ్గా కనిపించినా, పాతబస్తీతోపాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంత మెరుగుపడలేదు. పాతనగరంలో యువకులు కొందరు పోలీసులను కవ్వింపు చేసే తరహాలో వ్యవహరిస్తుండటం విశేషం. పోలీసు వాహనాలు వచ్చినప్పుడు గల్లీల్లోకి వెళ్లి, వాహనాలు వెళ్లగానే మళ్లీ గుంపులుగా వచ్చి రోడ్లపైకి చేరుతూ ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారు. చిన్నచిన్న కారణాలు చెప్తూ కుటుంబాలు కూడా వాహనాలెక్కి రహదారులపైకి రావటం ఇబ్బందిగా మారింది. వారిని ఆపితే కొన్ని చోట్ల పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. దీంతో రాచకొండ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు వారివారి పరిధిలో రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి సూచనలు చేయటం కనిపించింది. ఇలా అవసరం లేకున్నా బయటకు వస్తున్న జనంపై కొన్నిచోట్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పటంతో వారి ఆగడాలకు కొంత బ్రేక్ పడింది. స్వచ్ఛందంగా లాక్డౌన్కు అవకాశం కల్పించటంతో సోమవారం పూర్తిగా పరిస్థితి అదుపు తప్పగా, కొంతమేర నిర్బంధంగా నిర్వహించటంతో మంగళవారం మెరుగైంది. సీఎం మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నుంచి కర్ఫ్యూ తరహాలో దీని అమలుండే అవకాశం కనిపిస్తోంది. లాక్డౌన్లో భాగంగా అన్ని కేఫ్లు, పాన్ దుకాణాలు మూతపడ్డాయి. కానీ చాలా చోట్ల షెట్టర్లు వేసి, లోపల చాయ్ తయారు చేసి దొడ్డిదారిన విక్రయిస్తున్నారు. పాన్ దుకాణాల తలుపులు మూసేసి, ఆర్డర్లు తీసుకుని ప్రతి 10 నిమిషాలకోసారి లోపలి నుంచి పాన్లు తెచ్చి అమ్ముతున్నారు. నిర్వాహకులు సమీపంలో కూర్చుని పోలీసులు లేని సమయంలో ఇలా చేస్తున్నారు. దీంతో ఆయాప్రాంతాల్లోని గల్లీల్లో గుంపులు ఏర్పడుతున్నాయి. ఇకపోతే, కూరగాయలు సహా నిత్యావసరాలు కొనేందుకు వెసులుబాటు ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలాచోట్ల కొనుగోలుదారులతో రద్దీ ఏర్పడుతోంది. ఇది.. లాక్డౌన్ అసలు ఉద్దేశానికి తూట్లు పొడుస్తోంది. చాలాచోట్ల ఇరుకు ప్రాంతాల్లో కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు పెద్దపెద్ద సమూహాలుగా ఏర్పడుతున్నారు. దుకాణాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు. పోలీసులు వచ్చి సూచించిన సమయంలో దూరంగా వెళ్లి మళ్లీ తర్వాత గుమికూడుతున్నారు. దీన్ని నిరోధించాల్సిన అవసరముంది. కూరగాయల వ్యాపారులను దూరం దూరంగా ఉంచటంతోపాటు ఒక అమ్మకందారు వద్ద ఐదారురకాల కూరగాయలు లేకుండా కేవలం ఒక్క రకం మాత్రమే ఉండేలా చేయాలన్న సూచనలు వస్తున్నాయి. ఇరుకుగా ఉండే ప్రాంతాల నుంచి విక్రేతలను విశాలంగా ఉండే చోట్లకు మార్చాలని, కుదిరితే స్థానిక మైదానాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. పాల దుకాణాలు, కిరాణా దుకాణాల వద్ద ఇద్దరిద్దరు చొప్పున కొనుగోలుదారులు వచ్చేలా కట్టడి చేయాలంటున్నారు. అయితే నిత్యావసర సరుకులు, ప్రత్యేకించి కూరగాయలు సరసమైన ధరలకు లభించకపోయినా, తగినంత మేరకు అందుబాటులో లేకపోయినా జనంలో ఆందోళన చెలరేగే ప్రమాదం ఉంది. సోమవారం ఆంధ్రప్రదేశ్లో టమేటా, మిర్చి అసాధారణ రేట్లకు అమ్మడంతో ఆగ్రహించిన జనం అంగళ్లపై దాడిచేసి దోచుకెళ్లారని వచ్చిన వార్తలు నిజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. మూడూ వారాల షట్డౌన్ సమయంలో జనం అవసరాలు తీరకుంటే పరిణామాలు చేయిజారిపోయే ప్రమాదం ఉంది. ఈ మూడువారాల సమయంలో నిత్యావసరాల సరఫరాను ప్రభుత్వం ఏ మేరకు తీరుస్తుందన్నది మొత్తం వ్యవస్థకు పరీక్షగా నిలవనుంది.

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
5 hours ago

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
6 hours ago

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!
3 hours ago

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు
6 hours ago

కూరలో కరవేపాకు అయిన బండి సంజయ్
40 minutes ago

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భవిష్యత్
7 hours ago

అబ్బో సమస్యలపై కూడా జగన్ ఫోకస్ చేస్తున్నారా
8 hours ago

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ
21 hours ago

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు
17-04-2021

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి
a day ago
ఇంకా