మళ్లీ లాక్డౌన్ అంటే జనంలో తిరుగుబాటు.. అధికారుల మల్లగుల్లాలు
01-05-202001-05-2020 15:14:38 IST
Updated On 01-05-2020 15:31:55 ISTUpdated On 01-05-20202020-05-01T09:44:38.185Z01-05-2020 2020-05-01T09:43:56.452Z - 2020-05-01T10:01:55.696Z - 01-05-2020

ఇన్నాళ్లుగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఆర్థికంగా చితికిపోయినా లాక్ డౌన్ అమలుకు సహకరించి భరించిన జనం మరోసారి లాక్ డౌన్ విధిస్తే తిరుగుబాటుకు సిద్ధమయ్యేలా ఉన్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య శాఖలు ముందస్తుగా అంచనాకు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే ఉండటంతో, తమను నిర్బంధిస్తున్న పోలీసులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోలీసుస్టేషన్లపై దాడికి కూడా జనం భయపడలేదంటే ప్రజల మానసిక స్థితి ఒక ముగింపు దశకు చేరుకుందని, లౌక్ డౌన్ నిబంధనలతో వారిని ఇక కట్టడి చేయడం కష్టమని ప్రభుత్వాలు గ్రహించాయి. అందుకే మే నెల మొత్తంగా లాక్ డౌన్ విధిస్తేనే మంచిదని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు తప్పవని సంకేతాలు వెలువరిస్తున్నాయి. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారి సరిగ్గా ఇలాంటి ఆందోళననే వ్యక్తపరిచారు. ‘కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించి చాలా రోజులు గడిచింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పటివరకు ఎలాగోలా సహనంతో ఉన్నారు. వలస కార్మికులు భరించారు. వీధి వ్యాపారులు, చిరుద్యోగులు కలోగంజో తాగుతూ సహకరించారు. వారిలోనూ జాగ్రత్తగా ఉండాలన్న అవగాహన, కరోనాపై భయం ఏర్పడింది. అయితే మరోసారి లాక్డౌన్ను జనం అంగీకరించే పరిస్థితి కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే ఉంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను కొన్ని పరిమితులతో ఎత్తివేసే పరిస్థితులే ఉన్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. లాక్డౌన్తో వైరస్ వ్యాప్తిని చాలావరకు అడ్డుకోగలిగాం. దాన్ని ఎలా డీల్ చేయాలో అంచనాకు రాగలిగాం’ అని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఒకవేళ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తే ఎలాగన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. లాక్డౌన్ ఎత్తివేశాక రోడ్లపైకి జనం వస్తారు. వీధుల్లో చిరు వ్యాపారాలు ప్రారంభమవుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి రాకపోకలు పెరుగుతాయి. సాధారణ పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం వైరస్ నుంచి ఎలా గట్టెక్కాలన్న దానిపై వైద్య వర్గాలు విస్తృతంగా చర్చించాయి. చర్చించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని అధికారులు నిర్ణయించుకున్నారు. విదేశాల నుంచి, ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి ద్వారా రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించింది. మరోవిధంగా ఎక్కడా కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 28 మంది చనిపోయారు. కొందరు కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్లోనే సగానికిపైగా నమోదయ్యాయి. 11 జిల్లాలు కరోనా నుంచి విముక్తి పొందాయి. మిగిలిన జిల్లాల్లో ఎప్పుడో ఒక కేసు నమోదవుతోంది. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రమంతా చాలావరకు నియంత్రణలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది. పాజిటివ్ కేసులకు చికిత్స అందజేయడంలోనూ కృషి ఫలించింది. మరణాల రేటును తగ్గించగలిగింది. వైరస్ వ్యాప్తి ఉన్నా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉండటం, మృతి చెందిన వారు కూడా ఏదో ఒక రకమైన జబ్బుతో బాధపడిన వారు ఉండటంతో ఇది సాధారణ, ఆరోగ్యకరమైన వారిని ఏమీ చేయలేదన్న ధైర్యం ప్రజల్లో ఏర్పడింది. అయితే లాక్డౌన్ ఎత్తివేశాక సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ప్రజలు ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. వ్యాపారాలు నడుస్తాయి. పరిశ్రమలు తెరుచుకుంటాయి. అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి జనం రాకపోకలు పెరుగుతాయి. అలాంటప్పుడు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం అసాధ్యమని అధికారులు అంచనా వేశారు. అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకొని లాక్డౌన్ ఎత్తివేయడమే మంచిదన్న అభిప్రాయంలో వైద్యాధికారులు ఉన్నట్లు సమాచారం. లాక్డౌన్ అనంతర పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. వైరస్తో కలసి జీవించక తప్పదని వ్యాఖ్యానించారు. లాక్డౌన్తో వైరస్ వేగానికి కళ్లెం వేశాం. కంటైన్మెంట్ జోన్లు పెట్టి జల్లెడ పట్టాం. ఇప్పుడు కేసుల సంఖ్య కాస్తంత తగ్గింది. దీంతో కంటైన్మెంట్ జోన్లను చాలా వరకు తగ్గించాం. లాక్డౌన్ తర్వాత వైరస్ వ్యాప్తి చెందితే ఏం చేయాలో సన్నద్ధంగా ఉన్నాం. 25 వేల మంది వైద్య సిబ్బందిని పూల్ చేసి సిద్ధంగా ఉంచాం అంటున్న వైద్య ఆరోగ్య శాఖ మౌలిక వైద్య వసతులపై దృష్టి పెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులు సహా అన్ని రకాల ఆస్పత్రులను సాధారణ వైద్యంతో పాటు కరోనా లక్షణాలున్న వారికి చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయాలన్న సంకల్పంతో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నట్లు సమాచారం. పైగా, కరోనా చికిత్స కోసం ఇప్పటికే 8 ఆస్పత్రులు సన్నద్ధంగా ఉన్నాయి. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రిలో 1,500 పడకలు కరోనా కోసం సిద్ధం చేశారు. పీహెచ్సీ స్థాయిలోనూ ఆక్సిజన్ సపోర్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఆక్సిజన్ సపోర్టర్లు, వెంటిలేటర్లను భారీగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. కనీసం మరో వెయ్యి వెంటిలేటర్లు తెప్పించనున్నారు. దేశంలో రోజూ లక్ష పీపీఈ కిట్లు, మాస్క్ల ఉత్పత్తి ప్రారంభమైంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖకు భారీగా నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తీవ్రత తక్కువున్న కరోనా రోగులను ఇంట్లోనే ఐసోలేషన్ ఉంచొచ్చని తెలిపింది. ఇది చాలా దేశాల్లో అమలవుతోంది. కాబట్టి లాక్డౌన్ తర్వాత ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనే సమర్థత, అనుభవం వైద్య ఆరోగ్య శాఖకు వచ్చిందని చెబుతున్నారు. లౌక్ డౌన్పై తెలంగాణ వైద్యాధికారుల గైడ్ లైన్స్ సినిమా హాళ్లు, మాల్స్, రెస్టారెంట్లు తదితర ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగాలి. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు కొనసాగాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాల్లో భౌతిక దూరం పాటించేలా ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు అవసరమైనంత మేరకు ఇంటి నుంచే పని చేయించుకోవాలి. ఆఫీసుల్లో దగ్గర దగ్గరగా కూర్చోవడం, క్యాంటీన్లో కలసి భోజనం చేయడం, టీ టైంలో అందరూ కలసి ఉండటం మానేయాలి. ఆ మేరకు కఠిన చర్యలు చేపట్టాలి. అందరూ మాస్క్లు ధరించేలా ఉత్తర్వులు జారీ చేయాలి. అవసరమైతే ధరించని వారికి జరిమానా విధించేలా కఠిన నిబంధనలు తీసుకురావాలి. వైరస్కు వ్యాక్సిన్ రాలేదు. కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ పెరగాల్సిందే. కాబట్టి ఆరోగ్యకరమైన యువకులను బయటకు ఎక్కువగా అనుమతించాలి. పెద్ద వారు ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరం. 60 శాతానికిపైగా జనం వైరస్కు ఎక్స్పోజ్ అయితే, వ్యాక్సిన్ లేకున్నా కరోనా సర్వసాధారణమై పోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఇతరులకూ సోకదంటున్నారు. కాబట్టి దీని ప్రకారం వ్యవహరించాలి. ఇక ప్రజలు తమవంతుగా ఏంచేయాలంటే ఇప్పటిలాగే చేతులను శుభ్రంగా ఎప్పటికప్పుడు సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రపరుచుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. లాక్డౌన్ ఎత్తివేశారంటే వైరస్ పీడ విరగడైనట్లు కాదు. ఈ విషయాన్ని గుర్తించాలి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. నలుగురైదుగురు గుమిగూడి ముచ్చట్లు పెట్టే పరిస్థితి మానాలి. స్వచ్ఛంద లాక్డౌన్ను అమలు చేసేలా ఉండాలి. ఇళ్లల్లో వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. వారు బయటకు రాకుండా ఉండటమే మేలు. కాగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన మే 5న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో అమలుచేస్తున్న లాక్డౌన్ మే 7తో ముగియనుండగా, ఆ తర్వాత లాక్డౌన్ను సడలించాలా లేక పొడిగించాలా అన్న అంశంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. లాక్డౌన్ను పొడిగించాలని నిర్ణయం తీసుకుంటే కొత్తగా పలు అంశాల్లో మినహాయింపులు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించనుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలను వెల్లడించే అవకాశముంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
11 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా