ఢిల్లీలో 23 శాతం జనాభాలో వైరస్.. ఇది సామాజిక వ్యాప్తికి పక్కా సంకేతం.. సర్వే
22-07-202022-07-2020 11:26:00 IST
Updated On 22-07-2020 12:22:04 ISTUpdated On 22-07-20202020-07-22T05:56:00.327Z22-07-2020 2020-07-22T05:55:56.347Z - 2020-07-22T06:52:04.236Z - 22-07-2020

దేశంలో కరోనావ్యాప్తి ఎంతమేరకు ఉందో పరిశీలించేందుకు భారత వైద్య పరిశోధన మండలి మే నెల మధ్య నుంచి చివరి దాకా ఒక సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 83 జిల్లాల్లో సర్వే నిర్వహించగా.. 0.73 శాతం మందిలోనే యాంటీబాడీలు కనిపించాయి. అంటే వ్యాప్తి ఒకశాతంలోపే. కానీ ఒకటిన్నర నెల తర్వాత, ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా 23 శాతం మందిలో యాంటీబాడీస్ కనిపించాయంటే వైరస్ ఎంత ఉధృతంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఢిల్లీ జనాభాలో కేవలం 23.48 శాతం మందికే వైరస్ సోకిందని పేర్కొన్న కేంద్ర ఆరోగ్య శాఖ.. ఈ సమయంలో అలసత్వంతో వ్యవహరించకూడదని అభిప్రాయపడింది. మిగతా జనాభాకు వైరస్ సోకే అవకాశం ఉన్నందున కట్టడి చర్యలను కొనసాగించాలని అధికారులకు సూచించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), ఢిల్లీ సర్కారు కలిసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జూన్ 27 నుంచి జూలై 10 నడుమ దశలవారీగా 21,387 మంది రక్తనమూనాలను సేకరించి యాంటీబాడీ పరీక్షలు (సీరొలాజికల్ సర్వే) నిర్వహించారు. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఢిల్లీలో 23 శాతం మంది ఇటీవలికాలంలో వైరస్ బారిన పడినట్టు తేల్చారు. దాదాపు జనాభాలో నాలుగింట ఒకవంతు మందిలో కరోనా వైరస్ యాంటీ బాడీలు ఉన్నాయని తేలిందంటే వీరంతా గతంలో వైరస్ బారినపడినవారే. ఇది కచ్చితంగా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తికి తిరుగులేని నిదర్శనమని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. ఢిల్లీ జనాభా 1.9 కోట్లలో 23 శాతం అంటే దాదాపు 44.61 లక్షల మందికి వైరస్ సోకినట్టు లెక్క! దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనకు ఢిల్లీ సర్వే బలం చేకూర్చేలా ఉంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతమని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలికాలంలో ఢిల్లీలో కేసుల సంఖ్య బాగా తగ్గిపోవడానికి కూడా కారణం ఇదేనని, హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనించడమేనని వారు విశ్లేషిస్తున్నారు. ఇన్ని లక్షల మంది శరీరాల్లో యాంటీబాడీస్ ఉండడం వల్ల.. వారు కరోనా వాహకులుగా ఉండరు. వారిపై కరోనా ప్రభావం ఉండదు. వారి ద్వారా మరొకరికి వ్యాపించదు. దీనివల్ల వైరస్ వ్యాప్తి వేగం తగ్గుతుంది. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతోంది అదేనని వారు వివరిస్తున్నారు. జూన్ 23న ఢిల్లీలో అత్యధికంగా ఒక్కరోజే 3,947 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడు వారాల తర్వాత.. సోమవారంనాడు ఢిల్లీలో 1000లోపు కేసులు (954) నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గత వారంరోజులుగా బాగా తగ్గుతూ వచ్చి రికవరీ రేటు 85 శాతానికి చేరింది. అందుకే.. ఢిల్లీలో కొవిడ్19 ఇప్పటికే పతాకస్థాయికి చేరుకుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. తగిన జాగ్రత్తలతో పాఠశాలలు, కళాశాలలను తెరవడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చని ఎయిమ్స్ వైద్యులు చేసిన సూచన కూడా ఈ కోణంలో చూస్తే కొంతమేరకు సరైనదేననే అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి తీరుతెన్నులను గమనిస్తే ఎక్కువగా ప్రభావం చూపించిన చోట క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జనాభాలో ఎక్కువ మంది కరోనా బారిన పడడం, చాలామందికి లక్షణాలు కనిపించకపోవడం, వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందడం, తద్వారా వైరస్ వ్యాప్తి తగ్గడం... అమెరికాలో న్యూయార్క్ దగ్గర్నుంచి స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, మన దగ్గర ఢిల్లీ, మహారాష్ట్ర దాకా ఇదే తీరు కనిపిస్తోంది. వైరస్ బారినపడినవారిలో ఉత్పత్తి అవుతున్న యాంటీబాడీస్ రెండు, మూడు నెలల తర్వాత ప్రభావాన్ని కోల్పోవడం మరో సమస్య. ఒక ప్రాంతంలో ఇలా ఎక్కువ మందిలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయినా.. 2-3 నెలల తర్వాత వారున్నచోట ఇంకా వైర్సవ్యాప్తి కొనసాగుతూ ఉంటే వారు మళ్లీ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఈ సమస్య తప్పదు. మరోవైపున ఢిల్లీ ఉదాహరణనే తీసుకుంటే 44 లక్షల మందికి వైర్ససోకితే వారిలో కేవలం 1.23 లక్షల మందికే వైరస్ సోకినట్టు గుర్తించారు. అంటే కేవలం 2.81 శాతం. వారిలోనూ ప్రాణాలు కోల్పోయినవారు 3663 మంది. నలభైనాలుగు లక్షల మందిలో 3,663 మంది కరోనాకు బలయ్యారంటే మరణాల రేటు కేవలం 0.083 శాతం. కాబట్టి కరోనాకు మరీ అంత భయపడాల్సిన పని లేదని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు.

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
7 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
34 minutes ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
3 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
2 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
5 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
18 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
20 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
a day ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
a day ago
ఇంకా