చంద్రబాబుపై కోపమే అమరావతికి శాపమైందా?
24-10-201924-10-2019 09:00:55 IST
Updated On 24-10-2019 13:12:44 ISTUpdated On 24-10-20192019-10-24T03:30:55.972Z24-10-2019 2019-10-24T03:30:47.509Z - 2019-10-24T07:42:44.876Z - 24-10-2019

నవ్యాంధ్ర ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి. అంతర్జాతీయ స్థాయి నగరాలకు ఏ మాత్రం తగ్గకుండా మౌలిక వసతుల దగ్గర నుండి పరిపాలన అవసరాలకు మించి ఈ నగరాన్ని నిర్మించాలన్నది గత ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కల. తెలంగాణ నుండి విడిపోయాక రాజకీయ కారణాలతోనే విజయవాడకు పయనమైన చంద్రబాబు రాజధాని విషయంలో మాత్రం రాజీపడేదిలేదని విశ్వనగరం చేసి చూపిస్తామని ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. ఆ దిశగా అయన అడుగులు కూడా మొదలుపెట్టారు. రాజధాని ప్రణాళికలకు, నమూనాలకు సరిగ్గా రెండేళ్ల సమయంతో పాటు వందల కోట్ల రూపాయలను వెనుకాడకుండా ఖర్చు పెట్టేశారు. అంతర్జాతీయ స్థాయిలోనే అండర్ గ్రౌండ్ కేబుల్, గ్యాస్ సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు కాస్త సంప్రదాయాన్ని మేళవించిన అత్యాధునిక టవర్ల నిర్మాణానికి నమూనాలను ఆమోదించారు. ముందుగా తాత్కాలిక భవనాలను నిర్మించి అమరావతికి ఒక రూపునిచ్చి సంపూర్ణ అమరావతి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి మొదలుపెట్టారు. ఈలోగా ఎన్నికలొచ్చి అధికారం చేతులు మారింది. ప్రస్తుతం రాజధానిలో మొదలుపెట్టిన ఒక్క నిర్మాణం కొనసాగడం లేదు. అక్కడ నిర్మాణరంగంలో పనిచేస్తున్న సంస్థలన్నీ అక్కడ నుండి తరలివెళ్ళిపోయాయి. కార్మికులు, ఉద్యోగులు కూడా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాజధాని నాలుగు మండలాలలో అంత నిర్మానుష్యం. మొదలైన అన్ని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో ప్రభుత్వం సొంత నిధులతో కొన్న నిర్మాణ యంత్రాలు శిధిలమైపోతున్నాయి. రాజధాని కోసం సేకరించిన భూమిలో పిచ్చి మొక్కలు చెట్లుగా మారి మానులైపోతున్నాయి. ప్రస్తుతం అసలు అమరావతి అనే రాజధాని నగరం అసలు అక్కడ ఉంటుందా? ఉండదా? అన్న సందేహం ఏపీ ప్రజలలో బలంగా కదలాడుతుంది. దీనికి ప్రస్తుత ప్రభుత్వం సూటిగా సమాధానమే చెప్పడం మానేసింది. ఈ క్రమంలో చంద్రబాబు తనపై కోపంతోనే రాజధానిని చెట్టెక్కించేశారని వ్యాఖ్యానిస్తున్నారు. మరి నిజంగానే ఆయనపై కోపంతోనే జగన్ అమరావతిని ఆపేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ నిజానికి రాజధాని నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఎలాంటి వాగ్దానాలు ఇవ్వలేదు. ఎక్కడా ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రజలకు చెప్పలేదు. ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్రలో కానీ.. ఎన్నికల ప్రచారంలో కానీ ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని ఎక్కడా చెప్పలేదు. ఒకదశలో టీడీపీ.. అధికారమిస్తే వైసీపీ అమరావతిని చంపేస్తుందని ఆరోపణలు చేస్తే జగన్ ఆ సమయంలో కేవలం రాజధానికి కట్టుబడి ఉన్నామని మాత్రమే చెప్పారు. ఏపీ ప్రజలు రాజధాని అవసరమే లేదని ఓట్లేశారా? అంటే దానిని మించి ఒక్క అవకాశం.. నవరత్నాలకు ఆకర్షితులయ్యారు. ప్రజలకు తగ్గట్లే జగన్ కూడా ఇప్పుడు మాయచేసో.. మతలబు చేసో వాగ్దానాలను అమలు చేశామని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అమరావతి విషయానికి వస్తే ప్రపంచస్థాయి రాజధాని అన్నది చంద్రబాబు నాయుడి కల. దానికి జగన్ నిజం చేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇది ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఎక్కడా రాజధాని పేరు చెప్పి ఓటు బ్యాంకు తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయలేదు. మరి ప్రభుత్వం ప్రారంభించిన రాజధానిని ప్రభుత్వమే పూర్తి చేయాలి కదా అంటారా? నిజమే చేయాలి? కానీ ఎక్కడా నిర్ణిత గడువు లేదు కదా అంటారు వైసీపీ నేతలు. ఏది ఏమైనా ప్రపంచస్థాయి రాజధాని అన్నది వైసీపీ ప్రభుత్వం భుజానికెత్తుకుంటుంది అన్నది కల. అయితే కనీసం అడ్మినిస్ట్రేషన్ స్థాయి రాజధాని అయినా నిర్మించాలనుకోకపోవడం జగన్ సర్కార్ చేస్తున్న అతిపెద్ద తప్పుగా విశ్లేషకులు చెప్తున్నారు. చివరికి కనీసం అసలు రాజధాని అన్నది అమరావతిలోనే ఉంటుందా.. ప్రభుత్వంలో కొందరు చేస్తున్న లీకుల మాదిరి తరలిపోతుందా? అన్నదానిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ప్రజలకు చేస్తున్న ద్రోహంగానే భావించాలి. అమరావతి విశ్వనగరానికి బాబుపై కోపమే శాపమైందో లేదో కానీ ప్రజలే తమకు ఆ స్థాయి వద్దనుకున్నారని అనుకోవాలేమో! ప్రజలు ఏ అభిప్రాయంతో ఒక్క అవకాశం ఇచ్చారన్నది బహుశా మళ్ళీ ఎన్నికల వరకు తేల్చలేని అంశమేనేమో!!

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
12 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
4 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా